
బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆయన గుండెపోటుతో కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు వైద్యులు యోంజియోప్లాస్టీ చేశారు. ఈ క్రమంలోనే దాదా కోలుకోవడంతో గురువారం డిశ్ఛార్జ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆస్ప్రతి నుంచి బయటకు వచ్చిన గంగూలీ మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని, తన పరిస్థితి పూర్తిగా బాగుందని, తనకు వైద్యం అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్పారు. వాస్తవానికి దాదా బుధవారమే ఇంటికి చేరుకోవాల్సి ఉన్నా మరోరోజు ఆస్పత్రిలో ఉండాలని గంగూలీ నిర్ణయించుకున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. నేటి నుంచి గంగూలీ ఆరోగ్య పరిస్థితిని ఆయన ఇంట్లోనే వైద్యులు పర్యవేక్షించనున్నారు.