
జనగామలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీజార్జ్ చేయడంపై కమళం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్… ప్రభుత్వ, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల లోపు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఛలో జనగాం పేరిట పర్యటన చేశారు. అలాగే బీజేపీ నాయకురాలు విజయశాంతి కూడా తనదైన శైలిలో స్పందించారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ ఘటనపై స్పందించారు. తెలంగాణ పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనగామలో బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులపై దాడులు చేయడం పోలీసులకు ఫ్యాషన్గా మారిందని విమర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డిపై ఆయన ధ్వజమెత్తారు. ఖాకీ యూనిఫాం విలువ తీయవద్దని డీజీపీకి ఎమ్మెల్యే రఘునందన్ సూచించారు.
టీఆర్ ఎస్కు సపోర్టు చేయాలనుకుంటే.. ఖాకీ యూనిఫాం ను పక్కనబెట్టి... నేరుగా టీఆర్ ఎస్ చేరి కండువా కప్పుకోవాలని వ్యాఖ్యానించారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రఘునందన్ మండిపడ్డారు. అలాగే జనగామ వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అడ్డుకోవవడం దారుణమని అన్నారు.