
దేశాన్ని కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. కానీ మరో వైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని భావిస్తున్న తరుణంలో మరో మహమ్మారి విజృంభన కొనసాగిస్తుంది. రోజురోజుకూ దేశంలో కొత్త రకం కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ కేసుల సంఖ్య 102కు చేరినట్లు తెలిపింది.
అయితే పాజిటివ్ వచ్చిన వారిని ఆయా రాష్ట్రాల్లో ఒక్కో గదిలో ఐసోలేషన్లో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్లో ఉంచినట్లు పేర్కొంది. వీరి నమూనాలపై జన్యుపరీక్షలు చేస్తున్నామని తెలిపింది. ఈ స్ట్రెయిన్ వైరస్ విషయంలో రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నామని కేంద్రం తెలిపింది. దీనిపై పర్యవేక్షణ, పరీక్షలు చేయడం, శాంపిళ్లను ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సోర్టియం ల్యాబ్లకు పంపడంలో రాష్ట్రాలకు కేంద్రం సహకారం అందిస్తుందని వివరించింది. మరోవైపు జపాన్, కెనడా, జర్మనీ, బెబనాన్, సింగపూర్, డెన్మార్క్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ల్లో ఈ వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది.